విశాఖ సందేశం వార్తలు : ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌకను లేదా జలాంతర్గామిని భారత నౌకాదళం (Indian Navy)లోకి చేర్చుతున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి వెల్లడించారు. సముద్ర జలాల్లో భద్రతా సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సామర్ధ్యాల పెంపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. నౌకాదళంలో 'స్వావలంబన'ను ఓ వ్యూహంగానే కాకుండా, భవిష్యత్తు భరోసాకు పెట్టుబడిగా చూస్తున్నట్లు చెప్పారు.
"సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌకను లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం. 2035 నాటికి 200కు పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఆర్డర్ చేసిన 52 నౌకలన్నీ మన షిప్యార్డలోనే నిర్మాణ దశలో ఉన్నాయి" అని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అడ్మిరల్ త్రిపాఠి తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశీయంగా రక్షణ ఉత్పత్తుల విలువ మూడు రెట్లు పెరిగి గత ఏడాది రూ.1.5 లక్షల కోట్లు దాటిందన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్ వద్ద 145 యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.
ఏ నౌకాదళానికైనా స్వావలంబన, సమన్వయం, భద్రత అనేవి మూడు ప్రధాన స్తంభాలని అడ్మిరల్ త్రిపాఠి పేర్కొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్ధ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతలు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత పారిశ్రామిక వ్యవస్థలో సెమీకండక్టర్లు కూడా సబ్మెరైన్ల మాదిరి కీలకంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు

Comments
Post a Comment